Wednesday, July 31, 2013
'వొల్వరిన్' నా జీవితంలో చేసిన గొప్పపాత్ర!-జాక్మాన్
Wednesday, July 24, 2013
సూరి క్రూయిజ్ ఓ మినీస్టార్
Friday, July 19, 2013
'ఓం' చిత్ర సమీక్ష
'ఓం' చిత్ర సమీక్ష 2 / 5
హరిశ్చంద్ర ప్రసాద్ కుమారుడు అర్జున్ కు తండ్రి అంటే చాలా ప్రేమ . విరోధి బైరెడ్డి నుండి తండ్రిని పలుమార్లు రక్షిస్తాడు . హరిశ్చంద్ర ప్రసాద్ ను చంపడానికి గతం లో హరిశ్చంద్ర ప్రసాద్ తో విభేదాలున్న భవానీ శంకర్ ను పిలిపిస్తాడు . అనుకోకుండా కలిసిన అంజలి ప్రేమలో పడతాడు అర్జున్ . అదే సమయం లో హరిశ్చంద్ర ప్రసాద్ మిత్రుడి కూతురు రియా విదేశాలనుండి వస్తుంది . అర్జున్ ప్రేమించిన అంజలి ' బైరెడ్డి -భవాని శంకర్ ల మనిషి' అనే విషయం తెలియడం తో ... తండ్రి చనిపోయిన రియా ను పెళ్ళిచేసుకొమ్మని హరిశ్చంద్ర ప్రసాద్ అర్జున్ ని అడుగుతాడు . తప్పని పరిస్థితుల కారణం గానే బైరెడ్డి -భవాని శంకర్ ల మనిషి గా పనిచెయ్యాల్సి వచ్చిందని అర్జున్ తో అంజలి చెబుతుంది . ఆ తర్వాత అంజలి దారుణం గా హత్య చెయ్యబడుతుంది . అది భవాని శంకర్ చేసాడని- అతన్ని చంపడానికి వెళ్ళిన అర్జున్ కి తన జీవితంలో జరిగిన కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏమిటి ? తరువాత ఎం జరిగింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి ...
రెండేళ్ళ పాటు కష్టపడి 3డి విధానాన్ని అధ్యయనం చేసి, అధిక బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు . నిజానికి, మంచి కధతో తీసే చిత్రానికి 3డి ఎఫెక్ట్స్ మరింత ఆకర్షణవుతాయి . అయితే మన వాళ్ళు 3డి ఫై సరదాతో బోలెడు డబ్బులు పోసి అర్ధం లేని సినిమాలు తీస్తున్నారు . ఈ మధ్య వచ్చిన కామెడీ 3డి 'యాక్షన్' అటువంటిదే . ఈ కళ్యాణ్ రామ్ యాక్షన్ 'ఓం' కూడా అదే కోవకి చేరింది . పరమ రొటీన్ కధ... ఏమాత్రం ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లే... పట్టులేని టేకింగ్ తో - ఈ చిత్రం, ఎంతో ఆశించి వచ్చిన ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది . 3డి తప్పితే ఈ చిత్రం లో చూసేందుకు కొత్తగా ఏమీ లేదు . 'అవతార్' ఇన్స్పిరేషన్ అన్నారు కదా... మరి ఈ 3డి ఎఫెక్ట్స్ అయినా గొప్పగా ఉన్నాయా ?అంటే -కేవలం కొన్ని సందర్భాల్లోనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది. అంతకు మించి ఈ కధకు 3డి అవసరం కూడా లేదు . కధలో ట్విస్ట్ లు కూడా ఎక్కువే అయ్యాయి . ఆ ట్విస్ట్ లు బాగున్నప్పటికీ, వాటిని ప్రేక్షకుడికి కన్విన్సింగ్ గా చెప్పగలిగితేనే సినిమాకి ఉపయోగపడతాయి . లేకపోతే చిరాకు పుట్టిస్తాయి . ఈ కధలో ప్రధాన బలమైన ట్విస్ట్ లు -బలహీనమైన దర్శకుడి కారణం గా సినిమాకి మైనస్ అయ్యాయి . అలాగే ఈ సీరియస్ సినిమాలో రిలీఫ్ కోసం మంచి కామెడీగానీ , హీరో-హీరోయిన్ ల మధ్య చక్కటి ప్రేమ సన్నివేశాలు గానీ పెట్టకపోవడం మరో మైనస్ .
అర్జున్ గా కళ్యాణ్ రామ్ బాగా చేసాడు . అయితే అతని గెటప్ లో ఇబ్బంది వల్ల గ్లామర్ గా కనబడలేదు. అంజలి గా కృతి కర్బందా , రియా గా నికిషా పటేల్ అందం గా చేసారు . బైరెడ్డి గా రావు రమేష్ ఉత్తరాంధ్ర యాస తో రక్తికట్టించాడు . హరిశ్చంద్ర ప్రసాద్ గా కార్తీక్ తనదైన స్టైల్ లో చేసాడు . భవానీ శంకర్ గా మలయాళీ నటుడు సంపత్ రాజ్ ,మరో ప్రధాన పాత్ర లో సురేష్, ఇతర పాత్రల్లో సూర్య,విజయ సాయి, ఆహుతి ప్రసాద్, సితార, చిన్నా, నాగినీడు, రఘు నటించారు . అచ్చు -సాయి కార్తీక్ ల సంగీతం లో పాటలు చెప్పుకోదగ్గవి లేవు. రీ రికార్డింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగుంది . కళ్యాణ్-కృతి ల పాట చిత్రీకరణ కొత్తదనంతో బాగుంది . హోలీ పాట, క్లబ్ లో కళ్యాణ్- నికిషాల డాన్స్ కలర్ ఫుల్ గా చేసారు .అజయన్ విన్సెంట్ ఫోటోగ్రఫీ బాగుంది. విజయ్-రవి వర్మల యాక్షన్ సీన్స్ రిచ్ గా వున్నాయి -రాజేష్
Tuesday, July 16, 2013
అనుమాండ్ల భూమయ్య 'సౌందర్య లహరి' గీతాల సి .డి విడుదల
తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి అనుమాండ్ల భూమయ్య రచన- శారదా రెడ్డి గానం తో రూపొందించిన 'సౌందర్య లహరి' గీతాల సి .డి ని ఆలాపన-అక్షయ సంస్థలు సంయుక్తం గా 14న తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సభలో విడుదల చేసారు . డా"అక్కినేని నాగేశ్వర రావు, డా" సి .నారాయణ రెడ్డి, మాజీ డి .జి . పి కె . అరవిందరావు,తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డి, 'ప్రగతి ప్రింటర్స్' పరుచూరి హనుమంతరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .అనుమాండ్ల భూమయ్య అభినందన సంచికను కూడా ఆవిష్కరించారు .
Friday, July 12, 2013
'సాహసం' చిత్ర సమీక్ష
'సాహసం' చిత్ర సమీక్ష 2.5 / 5
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం ఫై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో బి.వి .యస్ .యన్ .ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు .
ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే గౌతమ్ కు ధనవంతుడు కావాలనేది జీవిత లక్ష్యం . అతని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ ఉంటాడు. కానీ వాటి ఫలితాలు నిరుత్సాహకరంగా వుంటాయి . అనుకోకుండా ఒక వర్షం కురిసిన రాత్రి- అతని తాతగారు దాఛిన డైరీ,ఒక హారం దొరుకుతాయి . అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. గౌతమ్ కి తాత గారైన వర్మ భారత్ – పాకిస్థాన్ విడిపోకముందు పెషావర్ లో వజ్రాల వ్యాపారం చేసే వారు . స్వతంత్ర సమయం లో జరిగిన అల్లర్లకు భయపడి అతను పాకిస్తాన్ నుండి పారిపోయి వస్తూ -తన వారసుల కోసం విలువైన వజ్రాలను ఓ చోట దాచి పెడతాడు . తాత డైరీ ద్వారా ఆ వివరాలు తెలుసుకున్న గౌతమ్ ఎలాగైనా వాటిని సంపాదించాలనుకుంటాడు. ఆ వజ్రాల నిధివున్న పాకిస్థాన్ లోని హింగ్లాజ్ దేవి దేవాలయానికి శ్రీ నిధి అనే భక్తురాలితో కలిసి వెళ్తాడు .అక్కడ కనిష్కుడి నిధికోసం వెతుకుతున్న సుల్తాన్ అనే మోతుబరి నుండి గౌతమ్ కు ప్రమాదం ఏర్పడుతుంది . ఆతర్వాత ఏమి జరిగిందీ సినిమాలో చూడాలి ...
విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో వచ్చిన వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇది . ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తగానే చెప్పుకోవాలి . అయితే , చంద్రశేఖర్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ యాక్షన్ 'నిధి అన్వేషణ' కధాంశంతో చెయ్యడం దీని ప్రత్యేకత . అడ్వెంచర్ చిత్రం చెయ్యాలనుకోవడం , భారీ ఖర్చుకి సిద్దపడ్డ నిర్మాత దొరకడం బాగానే వుంది గానీ...ఈ తరహా చిత్రాల్లో కావాల్సిన ...ఆసక్తి కలిగించే మసాలా,బిగి కలిగిన కధనం కొరవడడంతో ఈ చిత్రంలో దర్శకుడిగా చంద్రశేఖర్ అంతంత మాత్రంగానే రాణించాడు . బుర్రపెట్టి చూడాల్సిన సినిమా కాదని దర్శకుడే చెప్పినా... అడ్వెంచర్ చిత్రంలో ఉండాల్సిన థ్రిల్ తో పాటు వినోదం కూడా ఇందులో కనిపించదు .కధలో హీరో తాత వజ్రాలు... సుల్తాన్ కోరే కనిష్కుడి నిధి... దాని అన్వేషణ విధానాలు అంతా గందరగోళం గా వుంటుంది . సన్నివేశాల టేకింగ్ కూడా పట్టుగా లేదు .
సినిమా ప్రారంభంలో ఏటియం డబ్బు దోపిడీ సన్నివేశంలో చేజ్,ఫైట్...ఆర్కియాలజీ ఆఫీసు లో లాకెట్ కోసం ఫైట్...పెషావర్ లో సుల్తాన్ మనుషులనుండి హీరో తప్పించుకునే సన్నివేశాలు ... క్లైమాక్స్ చివరి సన్నివేశాలు బాగున్నాయి .పెద్దగా చదువుకోని సెక్యురిటీ గార్డ్ ప్రమాదకరమైన పాకిస్తాన్ లో వీరోచిత విన్యాసాలు చెయ్యడం , పరమ భక్తురాలైన హీరోయిన్, నిధికోసం ప్రమాదకరమైన అన్వేషణ చేస్తున్న హీరోతో పాటే కొనసాగడం అర్ధం కాదు . హీరోయిన్ గ్లామర్ ని కూడా సినిమా కోసం తగు విధం గా ఉపయోగించుకోలేదు . క్లైమాక్స్ లో నది ఫై వంతెన సన్నివేశాల్లో గ్రాఫిక్ వర్క్ బాగా లేదు. పాక్ లో గుర్రాల ఫై గొర్రె పిల్లతో ఆడే 'జుష్ కాషి' ఆటను ఇందులో ఉపయోగించుకోవడం బాగుంది కానీ, సమర్దవంతం గా చెయ్యలేకపోయారు . పాక్ సరిహద్దుల్లోని లడక్ ప్రాంతంలో చిత్రీకరించిన ప్రదేశాలు బాగున్నాయి .
గౌతమ్ గా గోపీచంద్ బాగా చేసాడు . వీర భక్తురాలు శ్రీనిధి గా అందాల ప్రదర్శన లేని పాత్ర బాగానే చేసింది . ఖయామత్ రాజు గా అలీ , సుల్తాన్ గా హిందీ నటుడు శక్తి కపూర్ ప్రధాన పాత్ర బాగా చేసాడు . అయితే వారిని మరింత బాగా ఉపయోగించు కోవాల్సింది . ఇతర పాత్రల్లో సుమన్ , సూర్య , నారాయణ రావు నటించారు . "నాదికాని కోటి రూపాయలైనా నాకొద్దు - నాది అన్నది అర్ధ రూపాయి అయినా వదులుకోను" - వంటి రాధాకృష్ణ మాటలు కొన్ని సందర్భాల్లో బాగున్నాయి . శ్రీ పాటల్లో చెప్పుకోదవి లేవు . రీ రికార్డింగ్ బాగుంది ... కొన్ని సీన్స్ లో చాలా బాగుంది . శ్యాం దత్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది . సెల్వ యాక్షన్ సీన్స్ బాగా చేస్తే ... రామకృష్ణ కధకి అనువైన సెట్స్ చక్కగా వేసారు -రాజేష్
Monday, July 8, 2013
వాడి కోసమే నా అన్వేషణ! -అసిన్
ఇళ్ళకెళ్ళి అడగలేముగా ?-ప్రియమణి
Friday, July 5, 2013
' సింగం' చిత్ర సమీక్ష
' సింగం' చిత్ర సమీక్ష 3/5
స్టూడియో గ్రీన్ -ప్రిన్స్ పిక్చర్స్ సంస్థలు హరి దర్శకత్వంలో ఎస్ .లక్ష్మణ కుమార్ ఈ చిత్రం నిర్మించారు .
ఒక పెద్ద మాఫియా ముఠా ను పట్టుకోవడానికి నరసింహం పొలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా చేరతాడు . అక్కడ ప్రత్యర్ధులు గా కనిపించే ముఠా నాయకులు భాయ్ ,త్యాగరాజు లు జనాన్ని అలా నమ్మిస్తూ , లోపాయికారీ గా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంటాడు . వారి వెనుక వున్న అంతర్జాతీయ డాన్ డానీ వంటి కీలక వ్యక్తులను పట్టుకోవాలను కుంటాడు . ఆ పని మామూలు పోలీసులతో కాదని, ప్రభుత్వ అనుమతి పొంది ఆపరేషన్- డి పేరుతో సంఘ వ్యతిరేక శక్తులను ఏరి పారేసే పని ప్రారంభిస్తాడు . తర్వాత ఏమి జరిగిందో సినిమాలో చూడాలి ...
సూర్య-హరి కాంబినేషన్ లో రూపొంది దేశమంతా విజయాన్ని అందుకున్న ' సింగం' (యముడు)కు ఇది కొనసాగింపు . మొదటి భాగం కన్నా దీన్ని మరింత జనాకర్షణీయంగా రూపొందించడంలో దర్శకుడు హరి విజయవంతం అయ్యాడు . ' సింగం' మంచి మసాలా మాస్ చిత్రం . మనం రొటీన్ గా చూసే మరో పొలీస్ కధా చిత్రమే అయినప్పటికీ- సన్నివేశాల్లో కొత్తదనం...చురుకుదనం ...కధనం లో బిగి... వేగం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి .విదేశాల పేర్లు చెప్పడం,చూపడం తోనే సరిపెట్టకుండా ఒక విదేశీయుడిని విలన్ గా ప్రదాన పాత్రలో పెట్టడం ఈ చిత్రంలో మరో ప్రత్యేకత . డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ అనువాదంలో- లొకేషన్లకు కాకినాడ -అరకు వంటి సరిపోయే పేర్లు పెట్టడంతో పాటు , పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెయిట్ చిత్రం చూస్తున్నట్లే వుంటుంది. పక్కా కమర్షియల్ చిత్రం అయినప్పటికీ దేశ భక్తిని జోడించడం అభినందనీయం . సూర్య నటన ఈ చిత్రంలో హైలైట్ .నరసింహంగా నిజంగా 'ఆకలితో వున్న సింహం' లానే దూకుడు గా నటించాడు .ఆవేశ పూరితమైన సన్నివేశాలతో పాటు, ఫైట్స్ లో కూడా చాలా బాగా చేసాడు . అనలరసు నేతృత్వం లో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీ ఖర్చుతో వినూత్నంగా చిత్రీకరించారు . శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు కూడా చిత్రానికి బలాన్ని ఇచ్చాయి. స్కూల్ జాతీయగీతం సమయం లో గూండాల రభస , కాకినాడ అల్లర్లు... అమ్మాయిని కాపాడటం, సహాయం అరెస్ట్ ,అరెస్టైన డానీని ముఠా నాయకులు విడిపించడం , పోలీస్ కమీషనర్.. భాయ్.. త్యాగరాజు లతో హీరో వాగ్వాదం ,సౌత్ ఆఫ్రికాలో డానీని అరెస్ట్ చేసేందుకు హీరో ప్రయత్నాలు ... చేజ్ బాగున్నాయి .కాకుంటే -డబ్బింగ్ బాగున్నప్పటికీ, సాయికుమార్ సినిమాల్లో లాగా డైలాగ్ పార్ట్ కొంత ఎక్కువయ్యి కొన్నిసార్లు గోలగా అనిపిస్తుంది .సినిమా రెండవ భాగం నిడివి ఎక్కువ అయ్యిన ఫీలింగ్ కలుగుతుంది . ఈ చిత్ర ప్రారంభంలో అంజలి తో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు . అయితే, గుండ్రంగా వుండే అంజలి డాన్సులకు పనికిరానని ఈ పాటతో నిరూపించుకుంది .
కాలేజీ అటెండర్ దాసు గా సంతానం కామెడీ ఈ చిత్రం లో బాగా పండింది . అతను 'పరలోకంలో వున్న ప్రభువా' అంటూ ప్యాంటులు ఊడ దీసే సన్నివేశాలు తెగ నవ్విస్తాయి .పాటల్లో గ్లామర్ కు తప్ప కావ్యగా అనుష్క పాత్రకు ప్రత్యేకత ఏమీ లేదు . హీరో ఫై అమాయకం గా మనసుపడే సత్య గా హన్సిక పాత్ర కూడా కొత్తగా ఏమీ లేదు . ఇతర పాత్రలను విదేశీ నటుడు డానీ సపానీ , ముకేష్ రుషి, రెహమాన్ , మసూర్ అలీ ఖాన్ , వివేక్ , విజయ కుమార్ , కె .విశ్వనాద్ , సుమిత్ర , నాజర్ , రాధా రవి , మనోరమ పోషించారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో గంగ్నమ్ డాన్స్ ని తలపించే ' సింగం డాన్స్' మాత్రమే చిత్రీకరణతో సహా బాగుంది . రీ రికార్డింగ్ , ప్రియన్ ఫోటోగ్రఫీ, విజయన్ ఎడిటింగ్ బాగున్నాయి -రాజేష్
Thursday, July 4, 2013
' సినీవినోదం.కామ్' రాంబాబు అడ్ల ను సత్కరించారు
'యువకళావాహిని'- 'గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్'ల ఆధ్వర్యంలోజూలై 2న శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో 'అధికార భాషా సంఘం' అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ 'గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ'ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ పూర్వ కార్యదర్శి కె.పద్మనాభయ్య విశిష్ట అతిధిగా పాల్గొన్న ఈ సభకు సారిపల్లి కొండల రావు అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా సినీవినోదం.కామ్ సంపాదకుడు , సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు అడ్ల ను సత్కరించారు
మీరు నా గతం తెలిసీ ఆదరించారు!-సన్నీ లియోన్
'గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ' ఆవిష్కరణ
తెలుగు సాంస్కృతిక రంగ వికాసానికి సాంస్కృతిక సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని 'అధికార భాషా సంఘం' అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో చాటేలా అందరూ ముందుకు రావాలన్నారు. 'యువకళావాహిని'- 'గురుప్రసాద్ కల్చరల్ ఫౌం డేషన్'ల ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ'ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ పూర్వ కార్యదర్శి కె.పద్మనాభయ్య మాట్లాడుతూ-ఆర్థిక, మిలిటరీ వ్యవస్థ కంటే సాంస్కృతిక వ్యవస్థ గొప్పదన్నారు. ప్రతి దేశం పొరుగు దేశాలతో సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక రంగ ప్రముఖులకు 'గురుప్రసాద్ ఎక్సలెన్సీ అవార్డు'లను ప్రదానం చేశారు. ఎం. కె.రాము, వంశీ రామరాజు, కిన్నెర రఘురామ్, కె.కె.రాజా, అభినందన భవాని, శంకర్రావు, పొత్తూరి .రంగారావు, ఎన్.వి.ఎల్.నాగరాజు, సంజయ్ కిషోర్ ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. సారిపల్లి కొండలరావుఅధ్యక్షత వహించిన ఈ సభలో సినీనటి శ్రావ్యారెడ్డి, కె.వి.కృష్ణకుమారి, శ్రీలత , సి.హెచ్. త్రినాధరావు,నూతల పాటి సాంబయ్య, వై.కె.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పద్మశ్రీ , శ్రీదేవి,చింతలపాటి సురేష్, పవన్,వి.కె. దుర్గ , మురళీధర్, వి.వి.రామారావుల ' సినీగీత లహరి' అలరించింది. సుదామయి వ్యాఖ్యాతగా వ్యవహరించింది .