RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, April 7, 2012

                                                     'రచ్చ' చిత్ర సమీక్ష            2.5/5                              
          
మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకం ఫై సంపత్ నంది దర్శకత్వం లో యన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రతి దానికీ పందెం కాసే బస్తీ వాసి బెట్టింగ్ 'రాజ్' ఒక సారి తన తండ్రి ఆపరేషన్ కోసం డబ్బు అవసరమై తన ప్రత్యర్ధి జేమ్స్ తో ఓ పందెం కడతాడు. దాని ప్రకారం, ఫ్యాక్షనిస్ట్ బళ్ళారి కూతురు చైత్రను రాజ్ ప్రేమలోకి దించాలి. అవసరార్ధం దీనికి వప్పుకున్న రాజ్- చైత్ర తన ప్రేమకు పెట్టిన మూడు పరీక్షల్లో నెగ్గు తాడు. రాజ్ తో చైత్ర  'ఐ లవ్ యూ' చెప్పే   సమయానికి వారి ఫై దాడి చేసిన బళ్ళారి గ్యాంగ్  నుండి చైత్రను కాపాడేందుకు ఆమెను తీసుకుని శ్రీశైలం అడవుల్లోకి వెళ్తాడు.అక్కడ తెలుస్తుంది చైత్ర బళ్ళారి కూతురు కాదని ...ఆస్తి కోసం ఆమెను బళ్ళారి చంపాలను కుంటున్నాడని. దానితో పాటు రాజ్ తండ్రికి...వారి వూరికి బళ్ళారి చేసిన ద్రోహం కూడా తెలుసుకున్న రాజ్ ఏమి చేసాడనేదే ఈ చిత్ర కధాంశం .

యువ నటులతో యూత్ సినిమా చేసి విజయవంతం అయిన సంపత్ నంది రాంచరణ్ తో ఈ భారీ చిత్రం చేసి అంతగా సఫలం కాలేదు  .సక్సెస్ సాధించిన సినిమాల ఫార్ములాను ఎంచుకోవడం తప్ప, ప్రధానమైన కధ విషయం లోనే తప్పు చేసిన దర్శకుడు ...కధనం విషయం లో మరింత గందర గోళానికి లోనయ్యాడు. ఫ్యాక్షనిస్ట్ నేపధ్యం లో తెలుగులో వచ్చిన చాలా సినిమాల సన్నివేశాలే  ఈ చిత్రం లో కనిపిస్తాయి. 'బన్నీ' వంటి సినిమాలు గుర్తొస్తాయి. సినిమా అంతా సూపర్ స్పీడ్ లో నడిపించాలనే దర్శకుడు ...  ఏ సన్నివేశం  ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చెయ్యలేక పోయాడు. కొత్తగా వుంటే పర్వాలేదు ...రొటీన్ సన్నివేశాలని ఎంత వేగంగా చూపినా లాభం  లేదు. చివరికి,  సినిమాలో ప్రధానమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కూడా విఫల మయ్యాడు . సినిమా ప్రారంభంలో ట్రైన్ కి ఎదురెళ్ళే సన్నివేశం తో సహా ఫైట్స్ లో గ్రాఫిక్స్ ప్రభావం ఎక్కువైపోయి సహజత్వానికి దూరమైపోయాయి.  శ్రీశైలం అడవులని చెప్పి...వెదురు తోటల్లో విదేశీయులతో ఫైట్  పెట్టారు. క్లైమాక్స్ లో రొటీన్ నరుకుడు ఫైట్  సుదీర్ఘంగా ప్రేక్షకులను బాధించింది. సినిమాలో ప్రతి చిన్న పాత్రకీ పాపులర్ నటీనటులను పెట్టుకున్నారు.కానీ ఎవరినీ సద్వినియోగం చేసుకోలేకపోయారు.

'బెట్టింగ్ రాజ్' గా పూర్తి మాస్ పాత్రలో  రాణించడానికి రాం చరణ్  బాగా కష్ట పడ్డాడు. అయితే చిరంజీవి లాకనిపించా లనే అతని ప్రయత్నం, అతని క్యారెక్టరైజేషన్ ...సినిమాటిక్ గానే వున్నాయి తప్ప , ప్రేక్షకులు హర్షించేలా లేవు. త్వరలో హిందీ సినిమా చేస్తున్నందుకు కాబోలు ...ఇందులో హిందీ  డైలాగులు ఎక్కువ పెట్టారు. పనిలో పనిగా ...నందమూరి వంశం  ఫైన  కూడా కొన్ని సెటైర్లు కొట్టారు.  చైత్ర గా తమన్నా తెలతెల్లగా అందంగానే వున్నా, ఆకర్షణీయంగా ఆనిపించలేదు. 'వానా వానా ' పాటలో మాత్రం సెక్సీ గా వుంది. రంగీలా గా బ్రహ్మానందం, లవ్ గురు పాపారావు గా అలీ కొంత నవ్వించారు. ఇతర పాత్రల్లో కోట, పార్తీపన్, దేవ్ గిల్, అజ్మల్, ముకేష్ రుషి,జయప్రకాష్ రెడ్డి,పరుచూరి వేంకటేశ్వర్ రావు, నాజర్, యల్.బి.శ్రీరాం,రవి బాబు తదితరులు నటించారు.పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అక్కడక్కడా పర్వాలేదు. హీరో విషయం లో చెప్పించిన డైలాగులు మాత్రం-' పిట్ట కొంచం ...పొగడ్త ఘనం'అన్నట్లున్నాయి. మణిశర్మ పాటల్లో టైటిల్ సాంగ్,'వాన వానా' తప్ప ఏ పాటా వినసొంపుగా లేదు. సమీర్ రెడ్డి  ఫోటోగ్రఫి బాగుంది.                                                                                                        -రాజేష్
                                                                                                                                                                                                                                              
                                                                                                                                                                                                                                                

0 comments:

Post a Comment