Thursday, November 29, 2012
‘చేపలమ్మా.. చేపలు’ పాట నెట్లో హల్చల్
గంగ్నమ్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ‘చేపలమ్మా.. చేపలు’ పాట నెట్లో హల్చల్ చేస్తోంది. బ్రిటన్కు చెందిన పాకిస్థానీ మహమూద్ షాహిద్ నజీర్(31) పాడిన ఈ పాటను యూట్యూబ్లో ఇప్పటికే 36 లక్షల మంది వీక్షించారు. లండన్లోని అప్టన్ పార్క్ క్వీన్స్ మార్కెట్లో చేపలు అమ్మే నజీర్ వినియోగదారులను అకర్షించడానికి.. ‘కమాన్ లేడీస్.. కమాన్ లేడీస్.. హావ్ ఎ లుక్.. వన్ పౌండ్ ఫిష్.. వెరీవెరీ గుడ్.. వెరీవెరీ చీప్’ అంటూ పాడిన ఈ పాట అందరినీ ఎంతో ఆకర్షిస్తోందని, ఈ క్రిస్మస్కు నంబర్ వన్ పాటగా నిలుస్తుందని ‘సన్’ పత్రిక తెలిపింది. యూట్యూబ్లో నజీర్ ఉంచిన ఈ పాట ఇప్పుడు అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా వార్నర్ మ్యూజిక్ సంస్థ దృష్టి అతడిపై పడేలా చేసింది. ఈ పాట కూడా దక్షిణ కొరియా పాప్ గాయకుడు సై పాడిన గంగ్నమ్ తరహాలో పెద్ద హిట్ అవడం ఖాయమని వార్నర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు అలేషా డిక్సన్, యూఎస్ బాయ్స్ బ్యాండ్ మైండ్లెస్ బిహేవియర్, రియో ఫెర్నినాండ్ వంటివారు ఈ పాటకు ఫిదా అయిపోయారు. క్వీన్స్ మార్కెట్లో నజీర్ ఈ పాట పాడటం మొదలుపెడితే చాలు.. జనం గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేస్తారట. కొందరైతే.. తన పాట కోసమే.. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఐరోపా నుంచి వస్తున్నారని నజీర్ చెప్పాడు. సంపాదన కోసం పాకిస్థాన్కు చెందిన నజీర్ ఏడాది క్రితం లండన్కు వచ్చాడు. ఆయన భార్య, నలుగురు పిల్లలూ పాకిస్థాన్లోనే ఉంటారు. ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే.. నజీర్ యజమాని వినియోగదారులను ఆకర్షించడానికి బిగ్గరగా అరవమని చెప్పాడు. అయితే, అలా అరవడం ఇష్టం లేని నజీర్.. ఈ పాటను పాడటం మొదలెట్టారు. వినియోగదారులకు ఈ పాట నచ్చడంతో.. నువ్వు పాప్ స్టార్ అవ్వాలి. నువ్వు ఎక్స్ఫ్యాక్టర్ షోలో పాల్గొనాలి అని వారు చెప్పారు. అయితే, ఎక్స్ఫ్యాక్టర్ షోలో ఇతడి పాటను తిరస్కరించారు. అయితేనేం.. ఇప్పుడు అంతకు మించి పెద్ద పాప్ స్టార్గా నజీర్ మారిపోయాడు. ఇప్పుడు అతడితో ఒప్పందం కుదుర్చుకున్న వార్నర్ మ్యూజిక్.. ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన గీతం కోసం ఎక్స్ఫ్యాక్టర్ విజేత పాటకు పోటీగా నజీర్ ‘వన్ పౌండ్ ఫిష్’ పాటను దించనుంది.
Sunday, November 25, 2012
'రొటీన్ లవ్ స్టోరీ' చిత్ర సమీక్ష 3/5
ఇంజనీరింగ్ విద్యార్ధి సంజు తన్వి ప్రేమలో పడతాడు .తన ప్రేమను చెప్పిన సంజు ని కనీసం 6 నెలలపాటు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి సమయం కోరుతుంది తన్వి .ఆ తర్వాత ఒక విహార యాత్రలో జరిగిన సంఘటనలతో ఆమె సంజు పట్ల సుముఖంగా మారుతుంది.అయితే సంజు తొందర పాటుని వ్యతిరేకిస్తుంది.సంజు కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా పెళ్లి చేసుకోవడం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో గుర్తి స్తాడు.తన తొందర పాటుకు తన్విని క్షమాపణ కోరతాడు.క్రమంగా తన్వి సంజు తో ప్రేమలో పడుతుంది.అయితే,తన్వితో దగ్గరగా ఉంటూ' ఒకరిని ఒకరు సరిగా అర్ధం చేసుకోవడం' తప్పనిసరిగా భావిస్తాడు సంజు .అతని మిత్రులు- దానికి అనుగుణంగా తన్వి ఇంట్లోవారిని బయటికి వెళ్ళేలా చేసి, సంజు-తన్వి కొన్నాళ్ళు కలిసి ఉండేలా ఏర్పాటు చేస్తారు.అయితే,అక్కడ కూడా వారి మధ్య గొడవలు తలెత్తుతాయి.ఈ కలహాల జంట ఆతర్వాతనైనా కలిసారా?అన్నది సినిమాలో చూడాలి...
'యల్.బి.డబ్ల్యు' తో దర్శకుడిగా మంచి పేరు సంపాయించిన ప్రవీణ్ సత్తారు చేసిన రెండవ చిత్రం కనుక, సహజం గానే ఈ చిత్రం ఫై మంచి అభిప్రాయం తోనే ప్రేక్షకులు వున్నారు.అందుకనే, ఓ పెద్ద సినిమా తో పోటీ పడి మరీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించ గలిగారు .అందుకు వీరు చేసిన ప్రచారం కూడా తోడయ్యింది.చిన్న చిత్రాల్లో ఈ స్థాయి పబ్లిసిటీ చేసిన చిత్రం ఈ మధ్య కాలం లో మరొకటి లేదు.'బూతు' యూత్ చిత్రాలు దండయాత్ర చేస్తూ, ప్రేక్షకుల అభిరుచి స్థాయిని దిగ జారుస్తూ,డబ్బు చేసుకుంటున్నఈ రోజుల్లో- అడ్డదారి ఆర్భాటాల జోలికి పోకుండా,కుటుంబంతో హాయిగా చూడదగ్గ చిత్రాన్ని అందించిన ప్రవీణ్ సత్తారు ధైర్యాన్ని మెచ్చుకోవాలి...అభినందించాలి. దర్శకుడు ఎక్కువ హడావుడి లేకుండా కేవలం ఒక యువ జంట ప్రధానం గా ....వారి మధ్య కీచులాటలు, అలకలు, అల్లర్లు, ఆవేశాలు, ముద్దులు, ముచ్చట్లు .... నేటి యువతరం మనోభావాలకు అద్దంలా ... 'రొటీన్ లవ్ స్టొరీ'నే భిన్నంగా చూపించడానికి ప్రయత్నించాడు ...చక్కగా మలిచాడు.'ఒకరిని నొకరు అర్ధం చేసుకోవడం కోసం' పాశ్చాత్య దేశాల్లో అనుసరించే 'డేటింగ్' విధానం లోనూ ఉపయోగాలున్నాయంటూ తెలివిగా ఇందులో చూపించాడు.కాశ్మీర్లో చిత్రీకరించిన సన్నివేశాలు కన్నుల పండువగా వున్నాయి.ఆడవాళ్ళ మనస్తత్వాన్ని గురించి సంజయ్ రెడ్డి చేసే గీతోపదేశం సన్నివేశం కూడా చాలా బాగుంది. అయితే, ఫార్ములా తో పనిలేకుండా సినిమా తీస్తున్నా...ఆసక్తికరంగా రూపొందించడం మాత్రం అవసరం అని దర్శకుడు గుర్తించాలి.సన్నివేశ రూపకల్పన లో దర్శకుడు ఇంకా పరిణితి సాధించాలి.సహజత్వం అనుకుంటూ కొన్ని చోట్ల సినిమా మరీ స్లో గా సాగింది...సంభాషణల్లో స్పష్టత కూడా కొరవడింది.అలాగే మాటల్లో తెలుగు శాతం బాగా తగ్గి పోయి ఇంగ్లీష్ ఎక్కువగా వినిపించింది.ఎమ్మెస్,హేమ, రాళ్ళపల్లి ఫై చేసిన కామెడీ 'జంగల్ మే మంగల్' సినిమాకి అతకలేదు.అలాగే తన్వి ప్రేమించేస్తోందని భ్రమించే తాగు బోతు రమేష్ పాత్ర కూడా అంతంత మాత్రం గానే వుంది.తన్విప్రేమ ను ఆశించే స్టూడెంట్ గ్యాంగ్ కామెడి కొంతవరకూ పర్వాలేదు.చివరికి హీరోగా మారిన నిర్మాతగా వెన్నెల కిషోర్ పాత్ర బాగుంది.
సంజు గా స్టూడెంట్ పాత్రలో సందీప్ ఆకార పరంగా అంత సరిపోకపోయినా,నటన లో మంచి మార్కులు సంపాయించాడు.అక్కడక్కడా పెద్ద హీరోలను అనుకరిస్తూ చెప్పినా... మొత్తం మీద 'డైలాగ్ మాడ్యు లేషన్' సందీప్ కి పెద్ద ఎసెట్. తన్వి గా అందం,అభినయం కలిసిన నటి రెజీనా చాలా బాగా చేసింది. స్నిగ్ద మిత్ర బృందం కూడా బాగా చేసారు. చంద్రమోహన్, కవిత ,ఝాన్సీ ఇతర పాత్రలు పోషించారు.దర్శకుడు రాసిన సంభాషణలు బాగున్నాయి.
మిక్కీ .జే .మేయర్ పాటల్లో- 'నా మనసు ఫై', ' నిన్నే చూస్తున్నా' అలరిస్తాయి. భార్గవ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది,ధర్మేంద్ర ఎడిటింగ్ బాగుంది. -రాజేష్
Friday, November 23, 2012
'డమరుకం' చిత్ర సమీక్ష
'డమరుకం' చిత్ర సమీక్ష 2.5/5
దేవతలు,రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం లో అందరూ మరణించినా అంధకాసురుడు అనే రాక్షసుడు మాత్రం ప్రాణాలతో మిగిలి ఉంటాడు . పంచగ్రహ కూటమి రోజున పుట్టిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని, వధిస్తే లోకాన్ని శాసించే శక్తి మంతుడవుతానని తెలిసి ...మహేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.అందుకు అడ్డు పడనని శివుడి నుండి మాట తీసుకుంటాడు.అయితే ,శివ భక్తుడిగా ఉంటూ,తన వారినందరినీ పోగొట్టుకుని శివ ద్వేషి గా మారిన మల్లికార్జున్ ని మహేశ్వరి ప్రేమిస్తుంది.మహేశ్వరి మనసు దోచుకోవడానికి అంధకాసురుడు మహేశ్వరి బావ రూపం లో వచ్చి, మల్లికార్జున్ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు.పరమేశ్వరుడు వీరిలో ఎవరికి సహకరిస్తాడు?చివరికి ఎవరు గెలుస్తారు?అనేది సినిమాలో చూడాలి...
సోషియో ఫాంటసీ కధాంశం తో, గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చిన చిత్రాల కోవలో వచ్చిన మరో చిత్రం ఈ 'డమరుకం' . ఈ మధ్యనే వచ్చిన' శక్తి', 'భద్రీనాద్' పెద్ద ఫ్లాప్ అయ్యాయి.వాటంత హింసించక పోయినా- 'డమరుకం' కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన చిత్రమే. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచిపేరు సంపాయించిన శ్రీనివాస్ రెడ్డి తన స్టైల్ కి పూర్తి భిన్నమైన కధతో, భారీ బడ్జెట్ తో చేసిన చిత్రం ఇది.వచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను శ్రీనివాస్ రెడ్డి సద్వినియోగ పర్చుకోలేకపోయాడనే చెప్పాలి. ఇటీవల భారీ చిత్రాలు చేసిన మన దర్శకులు చాలా మంది... నిర్మాతలను,హీరోలను మేనేజ్ చేసినంత బాగా, సబ్జెక్ట్ ని చెయ్యలేక పోతున్నారు.అందుకే పరిశ్రమ భారీ పరాజయాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.దేవుళ్ళతో కూడిన సోషియో ఫాంటసీ అనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో అటువంటిది ఏదీ కనబడదు. కనీసపు రీజనింగ్ లేకుండా,పరమ రొటీన్ గా , కేవలం గ్రాఫిక్స్ మాయాజాలం ఫై ఆధార పడి ఈ చిత్రం చేసారు.నిజానికి, ఇందులో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి .అయితే, బలమైన స్క్రీన్ ప్లే ఉన్నప్పుడే గ్రాఫిక్స్ సినిమాకి మరింత బలాన్నిస్తాయనే విషయం వీరు పట్టించుకోలేదు.అందుకే శివుడు సాంబ య్యగా భూలోకంలో తిరిగేస్తూ...బ్రహ్మానందం వంటి చిన్న పాత్రకు కూడా ప్రత్యక్షమైపోయి అన్నివిషయాలూ చెప్పేస్తుంటాడు.మల్లికార్జున్, మహేశ్వరి లకూ దైవానుగ్రహం వుందని చెప్తారు తప్ప ,అవి వారికి ఉపయోగ పడటం కనిపించదు.అంధకాసురుడు నిజంగా బలవంతుడా...కాదా అన్నంత అనుమానాస్పదం గా ప్రవర్తిస్తుంటాడు.క్లైమాక్స్ లో విలన్ దెబ్బకి హీరో ఆకాశం లోకి వెళ్లి అక్కడ శివ సాక్షాత్కారం పొంది కిందికి రావడం వంటివి తమాషాగా వున్నాయి.విలన్ శివభక్తుడు...హీరో శివ ద్వేషి కావడం ప్రత్యేకతను సంతరించుకున్నప్పటికీ, కధా క్రమంలో దాన్ని నిలుపుకోలేకపోయారు. నంది,బ్రహ్మ రాక్షసుడు వంటి గ్రాఫిక్స్ పేలవంగా వుంటే..అతి ముఖ్యమైన క్లైమాక్స్ లో డి .టి .యస్ సౌండ్ మిస్ కావడం పెద్ద మైనస్ .కామెడి లో సిద్ధహస్తుడైన శ్రీనివాస్ రెడ్డి ఇందులో కామెడి సన్నివేశాలను కొత్తగా చూపించలేక పోయాడు.
కధా నాయకుడిగా నాగార్జున నటన,దేవిశ్రీ ప్రసాద్ సంగీతం,చోటా ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో హైలై ట్స్ .సినిమా అంతా భారీ నిర్మాణ విలువలు కనిపిస్తాయి.నాగార్జున సిక్స్ పాక్ బాడీ తో చాలా హుషారుగా తన పాత్రను పోషించారు.కొత్తదనం లేని ప్రధాన పాత్రను అనూష్క అందం గా పోషించింది.'బొమ్మాళీ ' అంటూతన గొంతుతో 'అరుందతి' లోఅలజడి సృష్టించిన రవిశంకర్ ఇందులో అంధకాసురుడుగా తననటనతో,గొంతుతో పాత్రకు జీవం పోసాడు. ప్రకాష్ రాజ్ ను శివుడుగా చూపడంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.అనుష్క బావగా గణేష్ వెంకట్రామన్ బాగాచేసాడు.ఇతర పాత్రల్లో జీవా,బ్రహ్మానందం,కృష్ణ భగవాన్,రఘుబాబు,ఎమ్మెస్ నారాయణ,దేవన్, ప్రగతి, అభినయ నటించారు.శ్రీనివాస్ రెడ్డి సంభాషణలు చాలా సన్నివేశాల్లో బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ప్రేక్షకులను అలరించాయి.నేపధ్య సంగీతం కూడా బాగుంది.'కన్యా కుమారీ' పాట హుషారుగా ...'ప్రాణమా' అందంగా లలితంగా...'శివ శివ శంకర' భక్తి రసాత్మకంగా భారీగా చిత్రీకరించారు.చార్మి ఫై చేసిన 'గరం గరం చాయ్' మంచి మసాలా పాట .మొత్తం సినిమాని చోటా .కే.నాయుడు కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. గౌతం రాజు ఎడిటింగ్ గొప్పతనం కూడా అంతటా కనిపిస్తుంది. -రాజేష్
Wednesday, November 21, 2012
గోవాలో సినిమా పండుగ ప్రారంభం
గోవా నగరం అందంగా ముస్తాబైంది. ఈ సందడంతా నేడు ప్రారంభం అవుతున్న 43వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల కోసమే. ఈ నెల 30వరకు జరిగే ఈ చిత్రోత్సవాల్లో పలు భారతీయ భాషలకు చెందిన 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఆస్కార్ అవార్డ్గ్రహీత ఆంగ్ లీ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘లైఫ్ ఆఫ్ పై’ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ అతిథిగా పాల్గొనబోతున్నారు. ముగింపు చిత్రంగా మీరానాయర్ రూపొందించిన ‘ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
కాగా, ఇండియన్ పనోరమా విభాగంలో ఒక్క తెలుగు చిత్రం కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. దాదాపు వంద, ఆపై చిలుకు సినిమాలు నిర్మితమవుతున్న టాలీవుడ్ నుంచి కేవలం తొమ్మిదే సినిమాలు కమిటీ ముందుకు వెళ్లాయి. వాటిలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, మా ఊరి జోగిని, మల్లెల తీరం, ఓంకారం, వీరంగం’ లాంటి చిత్రాలు ఉన్నాయి. అయితే ఒక్క చిత్రం కూడా ప్రదర్శనకు అర్హత పొందలేకపోయింది. గత ఏడాది తెలుగు పరిశ్రమ నుంచి ‘విరోధి’ చిత్రం ప్రదర్శితమైంది. ఈ ఏడాది కనీసం ఆ ఊరట కూడా లేదు. ఇక ఇతర భాషల్లో విషయానికి వస్తే... మలయాళ పరిశ్రమ నుంచి దాదాపు 30 సినిమాలు వెళ్లగా, వాటిలో అయిదు సినిమాలు ప్రదర్శనకు అర్హత పొందడం విశేషం. ఇంకా ఒక తమిళ చిత్రం, బెంగాలీవి మూడు చిత్రాలు, భోజ్పురి నుంచి ఒక చిత్రం, ఒక కొంకణి చిత్రం, ఓ అస్సామీ చిత్రం, బ్యారీ భాషకు చెందిన సినిమా... ఇలా పలు భాషలకు చెందిన చిత్రాలు ప్రదర్శితం కాబోతున్నాయి.
మన తెలుగు పరిశ్రమతో పోల్చితే ఈ భాషలన్నింటిలోనూ తక్కువ సంఖ్యలో సినిమాలు రూపొందుతాయి. అయినా చిత్రోత్సవాల్లో పోటీపడటం అభినందించదగ్గ విషయం. తెలుగు పరిశ్రమ నుంచి సినిమాలు ప్రదర్శనలకు ఎంపిక కాకపోవడం అనేది ఆలోచించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా ఓ అవార్డును ప్రవేశపెట్టారు. ప్రత్యేక జ్యూరీ ఎంపిక చేసే చిత్రానికి ‘సెంటినరీ ఫిల్మ్ అవార్డ్’ను అందజేస్తారు. ఈ అవార్డులో భాగంగా 10 లక్షల రూపాయలు నగదు బహుమతి అందజేయబోతున్నారు.
'ప్రయోగం' దర్శకుడు భానుప్రకాష్ కు సత్కారం
'ప్రయోగం' చిత్రానికి 'తొలి చిత్ర ఉత్తమ దర్శకుడు' నంది అవార్డు పొందిన భానుప్రకాష్ కు 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు ఆధ్వర్యం లో రవీంద్ర భారతి లో అభినందన సత్కారం జరిగింది.సారిపల్లి కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నటులు రంగనాద్ మాట్లాడుతూ - సినిమాని 4 ఫ్రేముల్లో చెప్పడం ద్వారా భానుప్రకాష్ 'దర్శకావధాని' అనిపించుకున్నారు.ఈ చిత్ర నిర్మాణం లో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, తొలి చిత్రానికే నంది అవార్డ్ స్వంతం చేసుకున్నారని-అన్నారు. సాయి చంద్ మాట్లాడుతూ-అనుభవగ్యులైన పాత దర్శకులే చెయ్యలేని పని , తొలి చిత్రంలోనే భాను ప్రకాష్ చేసి చూపించాడని అన్నారు. ఆర్ .పీ.పట్నాయక్ మాట్లాడుతూ-సినిమాని 4 ఫ్రేముల్లో చూపించిన భాను, మనిషిలోని 4 రకాల స్వభావాలను చూపే చిత్రాన్ని కూడా చెయ్యాలని అన్నారు.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ-కష్ట సాధ్యమైన ఈ చిత్రాన్ని ఎంతో శ్రమించి, పక్కా ప్రణాళికతో భాను తెరకెక్కించారని అన్నారు. డా"కే.వి.కృష్ణ కుమారి మాట్లాడుతూ-పెద్ద చిత్రాలు ప్రేక్షకులను మత్తులో ముంచుతుంటే,యువత మత్తు లోంచి బయట పడాలని చెప్పే చిత్రాన్ని నిర్మించిన భాను ప్రకాష్ ఎంతైనా అభినందనీయుడని అన్నారు.
Friday, November 16, 2012
టీవీ నంది 2011 అవార్డుల ప్రకటన
2011 సంవత్సరానికి టీవీ నంది అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల విజేతల వివరాలను సమాచార శాఖ మంత్రి డీకే అరుణ సోమవారమిక్కడ సచివాలయంలో వెల్లడించారు. ఈ అవార్డుల ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. వారు విజేతల వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అవార్డులు పొందిన టీవీ సీరియళ్లు ఇవే..
ఉత్తమ టెలి చిత్రం: నాభూమి(దూరదర్శన్), ద్వితీయ ఉత్తమ టెలి చిత్రం: జోగిని(దూరదర్శన్); ఉత్తమ టీవీ ఫీచర్: అదుర్స్(ఈటీవీ), ద్వితీయ ఉత్తమ టెలి ఫీచర్: బ్రహ్మమొక్కటే(ఎస్వీబీసీ); ఉత్తమ మెగా సీరియల్: నయన(ఎస్వీబీసీ), ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్: పంచతంత్రం(ఈటీవీ); ఉత్తమ టీవీ డెయిలీ సీరియల్: పసుపు కుంకుమ(జీ టీవీ), ద్వితీయ ఉత్తమ డెయిలీ సీరియల్: మమతల కోవెల(జెమినీ టీవీ); ఉత్తమ దర్శకుడు: జి.అనిల్ కుమార్(మనసు మమత); ఉత్తమ నటుడు(అచ్యుత్ అవార్డు): శుభలేఖ సుధాకర్, ఉత్తమ నటి: ఆర్.పల్లవి(భార్యామణి); ఉత్తమ సహాయ నటుడు: కె.జయరాం(ఆడదే ఆధారం), ఉత్తమ సహాయ నటి: మధుమణి(జోగిని); ఉత్తమ హాస్య నటుడు: రామ్జగన్(చూడు చూడు తమాషా), ఉత్తమ హాస్యనటి: శ్రీలక్ష్మి(నేనే మీ అల్లుడు); ఉత్తమ విలన్: లావణ్య లహరి(అంతఃపురం); ఉత్తమ బాల నటుడు: మాస్టర్ నరేష్ చంద్ర(పసుపు కుంకుమ), ఉత్తమ బాల నటి: బేబీ అనూష, బేబీ దివిజ(అన్నా చెల్లెలు); ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: పి.భవాని ప్రసాద్(ధరణి), ఉత్తమ కథా రచయిత: దివంగత సీహెచ్ సుమన్. వీటితోపాటు ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంభాషణల రచయిత, ఉత్తమ సంగీత దర్శకుడు తదితర అవార్డులు ప్రకటించారు.
స్పెషల్ జ్యూరీ అవార్డులు
శ్రీ జమ, జయవాణి(జ్ఞాపకాలు), జి.ఉమా మహేశ్వరరావు(ఓం నమః), కె.వి.రెడ్డి(కుంకుమ రేఖ), జక్కల వెంకన్న(నాలో నేను), కర్రి బాలాజీ (బంద్). ఉత్తమ న్యూస్రీడర్లుగా కె.వినోద్ కుమార్(హెచ్ఎం టీవీ), ఎస్.లక్ష్మీ కళ్యాణి(టీవీ5)లకు జ్యూరీ అవార్డులు దక్కాయి. |
నచ్చిన సినిమా చేసేందుకే ఇక్కడికొచ్చాను! -ప్రవీణ్ సత్తారు
Tuesday, November 13, 2012
మేధస్సు ఉన్నప్రేక్షకుల కోసమే ‘విశ్వరూపం’
ఆటవిక యువతిగా అనూష్క ఛాలెంజ్
Saturday, November 10, 2012
ఒబామాను బలపరచిన హాలీవుడ్
Monday, November 5, 2012
సత్యవోలు సుందర సాయి 'ఇవి అబద్ధాలు కావు' పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత సత్యవోలు సుందర సాయి రచించిన 'ఇవి అబద్ధాలు కావు' పుస్తకాన్నిరవీంద్ర భారతి లో 'కిన్నెర ఆర్ట్ థియేటర్స్' ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా దారు కే.వి.రమణా చారి ఆవిష్కరించారు.అధికారి ప్రజల ఆశల రూపం గా వుండాలని , స్వార్ధం,అహంకారం,విభజన సూత్రం పాటించే వారైతే ప్రజలకు సేవ చెయ్యలేరని,అదే సుందర సాయి రచనల్లో కనిపిస్తుందని -రమణా చారి అన్నారు. డా "యన్.గోపి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో 'యస్.వి.బీ.సి' సి.ఈ.ఓ పాలకుర్తిమదుసూధన రావు, 'దూర దర్శన్ -సప్తగిరి' సంచాలకులు మల్లాది శైలజ సుమన్, రచయితలు జీడిగుంట రామచంద్ర మూర్తి ,ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.